కవితా స్రవంతి

అతనిప్పుడు

-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

అతనిప్పుడు మహావృక్షమే కావచ్చు
కానీ, ఒకప్పుడు నేలలో… విత్తుగా నాటబడినప్పుడు
ఎన్నో ప్రతికూలాలను ప్రతిఘటించేడు.
ఎన్నో పరివర్తనలను ప్రతిబింబించేడు.
వంచన,వంచినతల ఎత్తనీయకుండా చేస్తుంటే
ఆ అవమానంతో కుమిలి కుంచించుకు పోయేడు
ముంచిన అల మరలా లేవనీయకుండా చేస్తుంటే
ఆ అహంకార ఆధిపత్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేడు.
తన ఊపిరిని, ఉనికిని నిలబెట్టుకోవటమే
అప్పటి అతని ఏకైక ధ్యేయమయ్యింది..
అయోమయం, అతని జీవితంలో
సహజంగా ఒక అధ్యాయం అయ్యింది.
ఒదుగుతూనే ఎదగటం అతనికి ఒక ఆటఅయ్యింది.
ఎగ ఊపిరితోనే ఎగరటం అతనికి పరిపాటి అయ్యింది.
మొక్కదశ నుండి చెట్టుగా మారటం,
అతనికి మహా యజ్ఞమయ్యింది.
అలాంటి చెట్టుదశనుండి చేవతో
వృక్షంగా మారటానికి అతను
మహా ప్రళయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.
ఇనా, ఇప్పటికీ అతను గతాన్ని మరువడు.
ఎప్పుడూ బేలతనానికి వెరువడు.
అతనిప్పుడు ఎందరికో ఒకపాఠం అయ్యేడు
అతనితల ఇప్పుడు ఆకాశంవైపే చూస్తుంది
అతని మనసిప్పుడు ఆనందంలో మునకలేస్తోంది.
గతంలో అతనిని పరుగులు తీయించి అలిపించిన ఎండమావులే
వర్తమానంలో అతనిని గెలిపించిన నీటి బావులయ్యాయి.
అప్పట్లో పులిలా అతనిని బెదిరించిన పరిస్థితులే
ఇప్పుడు పిల్లిలాటి మనస్థితితో అతనికి తలవంచేయి.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked