సారస్వతం

చిరంజీవి శంకరశాస్త్రి

-శారదాప్రసాద్

జె.వి. సోమయాజులు గారు తెలుగుప్రేక్షక హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు. రంగస్థలం, వెండితెర, బుల్లితెర వంటి మాధ్యమాలన్నింటిలో నటించాడు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. జె.వి. సోమయజులు 1928 జూన్ 30 వ తెదీన శ్రీకాకుళం జిల్లా , లుకలాం అగ్రహారం గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావు. ఈయన సోదరుడు చలన చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటుడు జె.వి. రమణమూర్తి. ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. సోమయాజులు విజయంనగరంలో మహారాజా కళాశాలలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవాడు.తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. జె.వి.సోమయాజులు తన పదహారవ ఏట నుంచి రంగస్థల నటనపై కాంక్ష పెంచుకున్నారు. ముఖ్యంగా కన్యాశుల్కంలో “రామప్ప పంతులు” పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. సోమయాజులు తల్లి శారదాంబ అతనిని ప్రోత్సహించింది.జె.వి.సోమయాజులు స్వయంకృషితో నటన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కుటుంబమంతా మొదటి ప్రపంచయుద్ధ ప్రభావంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినపుడు ఆయన వ్యధ చెందారు.క్విట్‌ ఇండియా ఉద్యమం(1942),భారత స్వాతంత్య్ర సంగ్రామం,మొదటి రెండో ప్రపంచ యుద్ధాల సంక్షోభం వంటి వాటిని అర్థం చేసుకుంటూ, తాను నమ్మిన నాటకరంగాన్ని విస్మరించకుండా, నిబద్ధతతో నాటక రంగానికి అంకితమయ్యారు. తన సోదరుడు జె.వి.రమణమూర్తితో కలిసి కృషిచేశారు. వీరికి వేదుల జగన్నాథరావు అండదండలు లభించాయి. 1946 నుండి పెళ్లిపిచ్చి, దొంగాటకం నాటక ప్రదర్శనల్ని ప్రారంభించారు. తర్వాత కన్యాశుల్కం నాటకం ఆడటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి ప్రదర్శన వేయడానికి రెండున్నర సంవత్సరాల కాలం పట్టింది. 1953 ఏప్రిల్‌ 20వ తేదీన కన్యాశుల్కం తొలి ప్రదర్శన ఇచ్చారు. సోమయాజులుతోపాటు రమణమూర్తి, బీరకాయల రామదాసు, ఎం.జోగారావు, వంకాయల వెంకట అప్పారావు, కర్రి పద్మనాభాచార్యులు, వేదుల నరసింహ, జె.వి.శ్రీరామమూర్తి, పోడూరి విశ్వేశ్వరరావు, ఐఎస్‌. రాజకుమారి. వి.వి.సుమిత్ర, యు.ఎస్‌.ఎన్‌.రాజు, ప్రేమనాథ్‌, వేణుగోపాలరావు, రావికొండలరావు, గరిమెళ్ళ రామమూర్తి వంటి ఎందరో కళాకారులు ఈ నాటకంలో భాగస్వాములయ్యారు.ఈ నాటకంలో రామప్ప పంతులు పాత్ర పోషించి ధీరగంభీర స్వరంతో సహనటులందరికీ ఆదర్శంగా నిలిచారు సోమయాజులు.దీని తర్వాత ఆంధ్రనాటక కళాపరిషత్తులో బహుమతులు గెలుచుకుని ప్రతిభను మరింతపదును పెట్టుకోవాలనే పట్టుదలతో మనిషిలో మనిషి, నాటకం , పంజరం, గాలివాన, కప్పలు లాంటి నాటకాలను తీర్చిదిద్ది పోటీలలో నిలిచారు. లక్ష్యాలను, కీర్తిని సాధించారు .ఆ తరువాత కన్యాశుల్కం నాటకాన్ని ఆంధ్రప్రదేశ్‌ అంతటా ప్రదర్శనలిస్తూ 500కి పైగా ప్రదర్శనలు ఇచ్చి రికార్డు నెలకొల్పారు.తరువాత 13 ఎపిసోడ్‌లుగా కన్యాశుల్కంని టెలి సీరియల్‌గా రూపొందించారు. రెవిన్యూ శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్‌ లో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులలోనే ఆయనకు శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది.ఈ సినిమాకు ముందే దర్శకుడు యోగి రూపొందించిన ‘రారా కృష్ణయ్య’ సినిమాలో ఓ ముఖ్య పాత్రను ధరించారు. ఇది మంచి చిత్రంగా పేరుగాంచినా, ఆర్థికంగా విజయవంతం కాలేదు. అందుకే ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోలేదు. శంకరాభరణం సినిమాలోని శంకరశాస్త్రి పాత్ర ద్వారా ఆయన ఎంతో పేరు, ప్రఖ్యాతులు గడించారు. జె.వి.సోమయాజులు అనగానే శంకరశాస్త్రి, తాగయ్య చిత్రాలు వాటిల్లో ఆయన అద్భుతంగా జీవించిన విధానం గుర్తొస్తాయి. దీనితర్వాత 150 సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.అయినప్పటికీ, ఇప్పటికీ సోమయాజులు గారికి చిరస్థాయిగా మిగిలిన చిత్రం శంకరాభరణమే. శంకరాభరణం విజయవంతమైన తర్వాత, రెవిన్యూ సర్వీసులో డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పదవీ బాధ్యతల్ని నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నారని, ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి ఎవరో ఫిర్యాదు చేశారు. ఆయన దాన్ని పరిశీలించి, సాంస్కృతిక శాఖను ఏర్పరచి ఆ శాఖకు తొలి డైరెక్టర్‌గా సోమయాజులును నియమించారు. 1984లో ఎన్.టి.రామారావు ప్రభుత్వం 55 ఏళ్ళు నిండిన ప్రభుత్వోద్యోగులపై పదవీ విరమణ వేటు వేసింది.ఆ వేటుకి గాయపడిన వారిలో సోమయాజులు కూడా ఉన్నారు. రాష్ట్ర సాంస్కృతిక డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేసిన ఈ కళాకారుడిని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవించింది.అక్కడి రంగస్థల కళల శాఖకు సోమయాజులు అధిపతిగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే 1993 మార్చి 8వ తేదీన రసరంజని నాటక కళాసంస్థను నెలకొల్పారు. ప్రతిరోజూ నాటకాన్ని ప్రదర్శించాలనీ, టికెట్‌ కొని నాటకాన్ని చూసే ఆదర్శాన్ని పెంపొందించాలనే సదాశయంతో రసరంజని స్థాపన జరిగింది. హైదరాబాద్‌లో నాటకరంగ వికాసానికి ఈ సంస్థ ఎంతో కృషి చేసింది. ఈ క్రమంలో జెవి సోమయాజులు అందించిన కంట్రిబ్యూషన్‌ చెప్పుకోదగింది. శంకరాభరణం సినిమాలో “శంకరశాస్త్రి” పాత్రతో ప్రసిద్ధుడయ్యాడు. ‘వంశవృక్షం’, ‘త్యాగయ్య’ చిత్రాల్లో బాపు దర్శకత్వంలో నటించడం కూడా జె.వి. సోమయాజులుకు మరుపురాని అనుభూతినిచ్చింది. నన్ను త్యాగయ్య పాత్రకి, వంశవృక్షంలోని పాత్రకి బాపు రమణ ఎంపిక చేయడం కూడా నా పూర్వ జన్మ సుకృతమే అన్నాడాయన. త్యాగయ్య చిత్రం హిట్‌ కాకపోయినా ఆయనకు మట్టుకు మంచి నటుడిగా పేరొచ్చింది. ‘సప్తపది’, ‘పెళ్ళీడు పిల్లలు’, ‘నెలవంక’, ‘సితార’, ‘స్వాతిముత్యం’, ‘దేవాలయం’, ‘కళ్యాణ తాంబూలం’, ‘ఆలాపన’, ‘మగధీరుడు’, ‘చక్రవర్తి’, ‘స్వయంకృషి’, ‘స్వరకల్పన’, ‘అప్పుల అప్పారావు’, ‘ఆదిత్య 369’, ‘అల్లరిమొగుడు’, ‘అభినందన’, ‘రౌడీ అల్లుడు’, ‘ముఠామేస్త్రి’, ‘గోవిందా గోవిందా’, ‘సరిగమలు’, ‘కబీర్‌దాస్‌’, ‘భాగమతి’ మొదలైన తెలుగు చిత్రాల్లోను, ‘ఇదు నమ్మ ఆలు’, ‘ఒండగానబా…. శ్రీరాఘవేంద్ర’ తమిళ చిత్రాల్లో, ‘సోపానం’ అనే మలయాళ చిత్రంలో, ‘ప్యార్‌ కా సింధూర్‌’, ‘ప్రతిబంధ్’ హిందీ చిత్రాల్లోనూ నటించాడు. రంగస్థల అభిమానులకైతే ‘రామప్పపంతులు’గా సోమయాజులు చేసిన అభినయం,ఉచ్ఛరించిన సంభాషణలు గుర్తురాక మానవు. చిన్నతనం నుంచి తల్లి సుందరమ్మ పెంపకంలో భగవద్గీతను కంఠస్తం చేసారు సోమయాజలు. ఉద్యోగ నిర్వహణలో క్యాంపులకు వెళ్ళినపుడు అక్కడి వాతావరణం, జనుల వ్యవహార శైలిని పరిశీలిస్తూ రంగస్థల నటుడిగా నటనలో తన పరిధిని పెంచుకున్నాడు.అయితే ఆలస్యంగా లేటు వయసులో చిత్ర పరిశ్రమలో ఎంటరైనా, ద్వితీయ చిత్రం ‘శంకరాభరణం’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగలిగారు జె.వి.సోమయాజులు. యోగి దర్శకత్వంతో రూపొందించిన ‘రారా కృష్ణయ్య’ చిత్రంలో సోమయాజులు నటనను చూసిన ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం ఆయన ప్రతిభను గుర్తించి కె. విశ్వనాథ్‌కి వివరించారు.అప్పటికే ‘శంకరాభరణం’లోని ‘శంకరశాస్త్రి’ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలా అని ఇద్దరి ముగ్గురితో సంప్రదించి సందిగ్ధంలో ఉన్న విశ్వనాథ్‌ కు జె.వి. సోమయాజులు స్ఫురద్రూపం, వాక్పటిమలను చూసి ఆకర్షితులయ్యారు.విశ్వనాథ్‌ ఎంపిక సరైనదే అని చిత్రం విడుదలయ్యాక అందరికీ తెలిసింది.”శంకరాభరణంలో ఆ పాత్ర
నాకు లభించటం నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం.ఆ పాత్ర అలా ఆవిర్భవించి,అందరి మన్ననలు పొందగలిగిందంటే విశ్వనాథ్‌ గారి ప్రతిభే అందుకు కారణం. ఆయన గురువు,నేను శిష్యుడిని. కెమెరా ముందు ఎలా నటించాలో తెలియని నన్ను తీర్చిదిద్దింది ఆ మహానుభావుడే.రంగస్థల నటుడిగా నేను గడించిన అనుభవం ఈ పాత్రపోషణలో కొంతవరకు ఉపయోపడినా రంగస్థలంపై నటనకీ,కెమెరా ముందు టేక్‌కీ టేక్‌కీ మధ్య వ్యవధి ఉంటుంది కనుక అప్పుడు చేసే నటనకు ఎంతో తేడా ఉంటుంది.మూడ్‌ని కంటిన్యూ చేయడమూ కష్టమే..”అన్నారొకసారి సోమయాజులు.ఈయన 27-04-2004 న తన 75 వ ఏట మరణించారు!మరణించింది సోమయాజులు గారే,అయితే ఆయన పోషించిన పాత్ర శంకరశాస్త్రికి మరణం లేదు!శంకర శాస్త్రి చిరంజీవి!
జె.వి.సోమయాజులు గారికి నా స్మృత్యంజలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked