Month: August 2019

తెలుగు తల్లి

కవితా స్రవంతి
- బులుసు వెంకటేశ్వర్లు మధురమైన తెలుగుతల్లి మది పూచిన కల్పవల్లి పూలతేనే జావళి లో పులకించిన వెలుగువల్లి ఆణిముత్యముల వంటి అక్షరములురా అమ్మ మాట తొలిపాఠం అయిన భాష రా "2" జీవనదుల గలగలలై నినదించునురా జానపదుల గుండెల్లో నిదురించునురా తమిళ కవులు మనసుపడిన తరతరాలు విరబూసిన వెలుగుల వెన్నెల మడుగు కైతల ముత్యాల గొడుగు "2" పద్యానికి గద్యానికి పరిమళమ్ములద్దురా తల్లి భాష మారువకుంటే జీవితమె ముద్దురా   *****

శరత్ పున్నమలు

కవితా స్రవంతి
-శాంతి కృష్ణ (హైదరాబాద్) అరుదెంచిన ఆనందమేదో చైత్రగీతమవుతుంటే.... ఎన్ని జ్ఞాపకాల మధురిమలో పువ్వులా విచ్చుకున్న మనసుపై అదేపనిగ పుప్పొడులు కురిపిస్తున్నాయి.... ఈ ఏకాంతానికిపుడేపేరు పెట్టాలో తెలియట్లేదు.... వద్దన్న కొద్దీ మోసుకొచ్చే నీ ఊసుల తెమ్మెరలతో తన్మయమొందుతున్నాయి పరిసరాలన్నీ.... మళ్ళీ నిన్ను నాకు పరిచయం చేస్తూ పేరు తెలియని భాషలో మనసు అదేపనిగ కావ్యాలు రాస్తోంది.... గాలి లాలి పాటలో జోలపాడే ఈ రేయిలో కలల వర్షంలో మరీ మరీ తడవాలనుంది.... ఎన్ని మధుర భావనలు కురిశాయో.... కన్నులిపుడు శరత్ పున్నమలై వెలుగుతున్నాయి...!!

గురువులంటే జ్ఞానసిరులు

కవితా స్రవంతి
-"జనశ్రీ" జనార్ధన్ కుడికాల(వరంగల్) పల్లవి: గురువులంటే జ్ఞానసిరులు - గురువులంటే సురవరులు ప్రతిభాపాటవాలు పరిమళించు విరులు || గురువు || చరణం: విశ్వమంత విస్తరించు విజ్ఞాన వీచికలు విద్యార్థి లోకానికి నవ్య దిక్సూచికలు || విశ్వ || అజ్ఞానపు అడివి నుంచి విజ్ఞాపు వీధిలోకి నవయువతను నడిపించే నరవరుల పాచికలు || గురువు || చరణం: నమస్కార బాణాలకు లొంగిపోదురు సంస్కార శిష్యులగని పొంగిపోదురు || నమ || మత్సరాలు పెరిగినపుడు మానవతం తరిగినపుడు మదిలోపల మధనపడుచు కుంగిపోదురు || గురువు || చరణం: గురు శక్తి గొప్పదా? గురుభక్తి గొప్పదా? గురు శిక్షణ గొప్పదా? గురుదక్షిణ గొప్పదా? || గురు || తరతరాల తర్కమైన ఈనాటికి తేలకున్నా గురుశిష్యుల బంధము అన్నిటికన్న మిన్న || గురువు ||

వీక్షణం – 83

వీక్షణం
-రూపారాణి బుస్సా జూలై నెల 14వ తారీఖున బే ఏరియాలో శర్మిల గారి ఇంట్లో వీక్షణం 83వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. సాయి బాబ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని శర్మిలగారు స్వయంగా రచించిన "బెజవాడ నుంచి బెంగాల్ సరిహద్దు దాక" అన్న ఆసక్తికరమైన కథతో ప్రారంభించారు. నాయనమ్మ చిట్టెమ్మని తీసుకుని బెంగాల్ లో ఉంటున్న వాళ్ళ అబ్బాయి ఉంటున్న బెంగాల్ సరిహద్దు దాక ఎలా ప్రయాణం చేసి క్షేమంగా చేరారన్నది కథా విశేషం. తరువాత కార్యక్రమం అబ్బూరి ఛాయాదేవి గారు గురించి. వీరు స్త్రీల సాహిత్యానికి ద్రోణాచార్యులవంటి వారు ఇటీవలే స్వర్గస్తులైయ్యారు. వీరికి నివాళులు తెలుపుతూ ఆమె వ్రాసిన "వుడ్ రోజ్ " అన్న చిన్న కథను డా|| కె గీత గారు వాచించారు. ప్రతి ఇంటా జరిగే సహజమైన కథావస్తువు తీసుకుని అందరి కళ్ళల్లో కథా చిత్రం కనిపించేలా రాసారు. సభలోని వారంతా కథ గురించి తమ తమ అభిప్రాయాలను తెలిపారు. తదుపరి కె. వరలక్ష్మిగారిచే రచ

పద్దెనిమిదేళ్ళ వేడుకలు!

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు సిలికానాంధ్ర ఏర్పడి 18ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆగష్టు 4వ తేదీన సంస్థాపక దినోత్సవాన్ని జరపటానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో ప్రముఖ వాయులీన విద్వాంసులు అశోక్ గుర్జాలే ఆధ్వర్యంలో 20మంది కళాకారులతో వాయులీన నాదామృతవర్షిణి పేరిట సంగీత విభావరి, సినీకవి జొన్నవిత్తుల ఆధ్వర్యంలో పేరడీ కవితాగానం నిర్వహింపబడతాయి. అలాగే, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సేవాసంస్థ రోటరీ క్లబ్ 'సిలికానాంధ్ర రోటరీ క్లబ్' పేరుతో ఏర్పాటు చేయబడుతుంది. ఈ శాఖ సంస్థాపక దినోత్సవ సందర్భంగా 203 మంది సభ్యులతో 'చార్టరింగ్ సెరిమొనీ' జరుతుంది. వివరాలకు 'ఈ మాసం సిలికానాంధ్ర ' శీర్షిక చూడండి. అందరికి ఇదే ఆత్మీయ ఆహ్వానం!