సమాజం - సాహిత్యం
క్షణక్షణం ఈ విశ్వం పరివర్తన చెందుతున్నదన్న నిజం అందరూ అంగీకరించిన సత్యమే. మారుతున్న జగత్తులో మానవుడు నూతనత్వాన్ని కోరుకుంటాడు. కాలంతోపాటు సంప్రదాయాలు, కట్టుబాట్లు మారుతుంటాయి. కొత్త ఆచారాలు మొదలవుతుంటాయి. కొంగ్రొత్త ఇజాలు, వాదాలు పుట్టుకొస్తుంటాయి. సంఘంలో కొత్త సంఘర్షణలు ఆరంభమవుతాయి. పాత విషయాలన్ని చరిత్ర పుటల్లోకి జారిపోతుంటాయి. సాహిత్యం ద్వారానే చరిత్ర భద్రపరచబడుతుందన్న విషయం జగద్విదతమే.
- మారుతున్న కాలంతో పాటు కొత్త రచయితలు పుట్టుకొస్తుంటారు. అలాగే రచయితలు మారుతున్న ఆలోచనా ధోరణులను, భావజాలాల్ని, అందువలన జరిగే మంచిచెడ్డల్ని తమ స్వీయానుభవాలతో సమన్వయించుకొని సాహిత్య రచనలు చేస్తూ ఉంటారు. ప్రతి కళ పరమావధి ప్రజలను చేరడమే. ప్రజలంటే సంఘం లేదా సమాజం. అందుకే రచయితలు సాహిత్య కళ ద్వారా సమాజంలో మార్పుకోసం, అపనమ్మకాలు తొలగించడం కోసం, భావపరిణామం కోసం కృషిచేస్తుంటారు.
కవిత్వం, కథ, నవల, నాటకం మొదలైనవి సాహిత్యంలో ముఖ్యమైన ప్రక్రియలు. రచయితలు తమకు వీలైన పరిధిలో ఏదో ఒక పక్రియలో రచనలు కొనసాగిస్తుంటారు. కవిత్వం ఎల్లప్పుడూ అవేశపూరితమైనది కాకున్నను, సంఘంలో ఏదైనా కొత్త ఒరవడి ఆరంభమైన తొలినాళ్ళలో ఆ ఒరవడిలోని మంచిచెడులను, సుఖదుఃఖాలను, ఆకాంక్షలను మొదట్లో కవులు కవిత్వం ద్వారా వెల్లడిస్తారు.
ఆ ఒరవడి లేక మార్పు సమాజంలో వేళ్ళూనుతున్న మలినాళ్ళలో రచయిత కొన్ని సన్నివేశాలని, కొన్ని పాత్రల ద్వారా (అంటే ప్రథమపురుషలో), లేదా తనే ఒక పాత్రగా మారి (అంటే ఉత్తమపురుషలో) ఆ మార్పులోని వైఫల్యాల్ని, సంఘర్షణలనీ కథారూపంలో వెల్లడిస్తాడు. అయితే కథకున్న విస్తృతి తక్కువ కాబట్టి కథలో సంఘటల్ని విశ్లేషిస్తూ, తన దృక్పఠాన్ని వెల్లడించి మిగతా విషయాల్ని పాఠకుల ఆలోచనలకే వదిలివేస్తాడు.
ఇంకా ఆ మార్పు సంఘంలో బలంగా నాటుకొనిపోతూ పరిపక్వ దశకు చేరుతున్న తరుణంలో , మాన్వ్వజీవితాల్ని, వారి మధ్య అనుబంధాల్ని, దైనందిక కార్యక్రమాల్ని ప్రభావితం చేస్తుంటే రచయితకు కావల్సినన్ని కథా వస్తువులు, అనుభవాలు, రాయటానికి కావలిసినంత ఇతివృత్తం దొరుకుతాయి. ఆలాంటి సమయాల్లో ఆ మార్పుమీద నవలలు రచింపబడడం మొదలౌతుంది. కథకంటే నవల విస్తృతి ఎక్కువ కాబట్టి నవలా రచయిత జరిగినదాన్ని ప్రస్తావిస్తూ, జరుగుతున్నదాన్ని విశ్లేషిస్తూ, జరగబోయేదాన్ని ఊహిస్తూ, ఈ విధంగా జరగాలని ఆకాంక్షిస్తూ రచన కొనసాగిస్తాడు.
ఇక నాటకం గురించి చెప్పుకోవలసివస్తే, నాటకం చదివినప్పటికన్నా రంగస్థలం ప్రదర్శించినప్పుడే దానిలోని సత్తా బయటపడుతుంది. నటులు పాత్రలకి జీవం పోసి తమ హావభావాలతో నాటకాన్ని రక్తి కట్టించినపుడు ప్రేక్షకుడు తన కళ్ళెదుటే సజీవమగా జరుగుతున్న అనుభూతికి లోనౌతాడు. అంతగా ప్రేక్షకుని మనస్సులో ముద్ర వేయగల శక్తి నాటకానికుంది.
అయితే రచయితలు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం, కత్తి కంటే కలానికి పదునెక్కువని. Pen is mightier than sword అనే ఇంగ్లీషు జాతీయం మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే చేతిలో ఉన్న కత్తివల్ల ఒక మనిషి మాత్రమే బలోపేతమైతే రాసిన పదాలకున్న శక్తి వల్ల సమాజంలోని మనుషులనే ప్రభావితం చేయవచ్చు. మరి అంతటి పటిమని రచయిత ఏ మార్గంలో ఉపయోగించుకుంటాడో అతని విజ్ఞతకే వదిలివేయబడుతుంది. రచయితలు సమాజంపట్ల మంచి అవగాహనని పెంపొందిచుకుంటూ, ఒక నిబద్ధతని పాటిస్తూ, సన్మార్గంలో రచనలు చేస్తుంటే ఆ రచనల ప్రయోజనం నెరవేరుతుంది.
ఏతావాతా మనకు తెలుస్తున్నదేమిటంటే, సాహిత్యం సమాజానికి ఎంతగానో అవసరం. గతకాలాన్ని మనం మరిచిపోకుండా పుస్తక రూపేణ భద్రపరుస్తూ, వర్తమాన జీవనాన్ని విశ్లేషిస్తూ, బంగారు భవిష్యత్తుకు కొత్తబాటలు వేసేదే ఉత్తమమైన సాహిత్యం.
మీ
తాటిపాముల మృత్యుంజయుడు
సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.