సిలికానాంధ్ర వారు నిర్వహిస్తున్న కూచిపూడి నాట్య సమ్మేళనానికి ఎంతో ఆర్భాటంగా సన్నాహాలు జరుగుతున్నాయి. కూచిపూడి నాట్యములో ప్రావీణ్యత కల ఎంతో మంది కళాకారులు, ప్రాజ్ఞులు ఈ సమ్మేళనానికి దేశవిదేశాలనుండి విచ్చేస్తున్నారు. ఈ నాటి యువతరం వారు తప్పక తమకు కలుగుతున్న సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆశక్తి కల వారందరూ పాల్గొనలాని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. కార్య నిర్వాహకులకు మనకు చేతనయిన సహాయ సహకారాలను అందిద్దాము. కళలను నేర్చుకోవటం, ప్రొత్సహించటమే కాదు, వాటికి ప్రాణం పోసి జనాదరణ పొందించటం ఒక మహా యజ్ఞం, అది ప్రస్తుత పరిస్థితులలో చాల కృషితో కూడిన పని.
ఈ కూచిపూడి నాట్యాన్ని ఆంధ్ర దేశములో నేర్చుకుని అమెరికాకు వలస వచ్చిన వారిలో నెబ్రాస్కాకు చెందిన శ్రీమతి జ్యొతి ఉదయ్ గారిని ఈ నెల మన శీర్షికలో పరిచయం చేస్తున్నాము. జ్యొతి గారి తల్లి పేరు సత్యవతి, తండ్రి పేరు సోమశేఖర్. తల్లి ప్రోత్సాహముతోనే వరంగల్ లో నివసిస్తున్నప్పుడు మిక్కిలి పిన్న వయస్సులోనే, అంటే తన అయిదవ సంవత్సరములప్పుడే రాజేశ్వరి మల్లికార్జున్ గారి దగ్గర నాట్యం నేర్చుకోవటం మొదలు పెట్టారని అన్నారు. రెండు సంవత్సరాల తరువాత వెంపటి నాగేశ్వరిగారి దగ్గర దాదాపు పది సంవత్సరాల కాలం శిక్షణను అవలంబించానన్నారు. తాను చదువుకుంటున్నపుడు స్కూలు అయిపోయిన తరువాత నాట్యం కూడా నేర్పేవారని ఆవిడ అన్నారు. తాను ఆరు, ఏడు తరగతులు చదువుతున్నపుడు వేసవిసెలవులు రాగానే ఆట్యం నేర్చుకోవడానికి కూచిపూడి గ్రామానికి క్యాంపులకు వెళ్ళటం ఎంతో సరదాగా ఉండేదని అన్నారు.అదే సమయములో వరుసగా మూడు సంవత్సరాలు ఆవిడ ఎన్నో బాలల అకాడెమి అవార్డ్స్, వంశీ నేషనల్ అవార్డు పొందారు. ఇదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ లోని కళాజ్యొతి, కళానిలయం సంస్థలనుండి ఎన్నో అవార్డులు పొందారని, వెంపటి నాగేశ్వరి గారి అధ్వర్యములో చిలకలూరి పేటలో జరిగిన నాట్య పోటీలలో తనకు "నాట్యమయూరి" బిరుదు కూడ వచ్చిందని ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. ఆ "నాట్యమయూరి" అనే బిరుదు అవిడకు ఎంతో అపురూపమయినదని అన్నారు.ఆవిడ స్కూలులో చదువుతున్నపుడు 36 మంది విద్యార్ధులతో కలిసి "ఏసుప్రభువు" అనే నృత్య నాటికను తానే కొరియొగ్రాఫి చేసారని అన్నారు. అపుడు అందరూ తనని ఎంతో మెచ్చుకున్నారని, అంత చిన్న వయసులోనే ఎంతో పేరు కూడా తెచ్చుకున్నారని కూడా అన్నారు.
జ్యొతి గారు ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు వరంగల్ కి వచ్చి ప్రదర్శనలిచ్చిన శోభానాయుడు గారి కూచిపూడి నాట్యం చూసి ఆవిడ అన్నా, ఆవిడ నాట్యం అన్నా ఎంతో అభిమానం పెంచుకున్నారని చెప్పారు. అదే సమయములో కొన్ని కారణాలవలన హైదరాబాదుకి వలస వెళ్ళటం జరిందని, అప్పుడే శోభానాయుడి గారి దగ్గర తిరిగి శిక్షణను ప్రారంభించారని ఆవిడ అన్నారు.ఆవిడ భారత దేశములో సుమారు 200 ప్రదర్శనలిచ్చారు. అంతే కాకుండా కాకతీయ, కోనార్క్, కూచిపూడి ఉత్సవాలలో కూడా పాల్గొన్నారని చెప్పారు. ఆవిడ గురువు గారితో కలిసి అమెరికాలో కూడా ఎన్నో ప్రదర్శనలిచ్చానన్నారు. ఆవిడ గురువు శోభానాయుడు గారి ఆధ్వర్యములో నిర్వహించిన నృత్యనాటకాలలో రుక్మిణిగా, నారదుడిగా (పారిజాతాపహరణం) చండాలికలో మాయ, పాలు, గాజులు పాత్రలను, శ్రీకృస్ణ శరణం మమలో యశోదగా, కృష్ణుడిగా, గోపికగా, శకునిగా, కళ్యాణ శ్రీనివాసంలో బ్రహ్మగా, సరస్వతిగా, భ్రుగుమహర్షిగా, సఖిగా, శివుడిగా, పార్వతిగా, గొల్లభామగా, చొళరాజుగా, కళ్యాణ రాజుగా ఇలా ఎన్నెన్నో విభిన్నపాత్రలను పోషించారు. ఆవిడ "నాట్యవిశారద" బిరుదును కూడా పొందానన్నారు.హైదరాబాదు దూరదర్శన్ కేంద్రంలో గ్రేడ్ "ఎ" కళాకారిణిగా పేరుపొందారని అన్నారు.
జ్యొతి గారు ఎన్నో నృత్య నాటికలను కొరియొగ్రఫి చేసారని, తన దగ్గర సుమారు 36 మంది విద్యార్ధులకు శిక్షణ పొందుతున్నారని అన్నారు. జ్యొతిగారిని తన చిన్నప్పుడు అందరూ "ముద్దుగారే యశోద" అని పిలిచే వారని, తానకు కృషుడి పాత్ర అంటే చాల ఇష్టమని, ఆ పాత్రలో ఎంతో లీనమయిపోయి చేసే వారని, జీవించి పోషించే వారని ఆవిడ అన్నారు. 1992 సంవత్సరములో తన గురువుగారి ఆధ్వర్యములో ఇతరులకు శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టారని, ఆ తరువాత రాచెష్టర్ - న్యుయార్క్ లోను, గ్రాండ్ బ్లాంక్ - మిచిగన్ లోను, ప్రస్తుతము నెబ్రాస్కా లో కూడా ఎంతో మంది విద్యార్ధులకు తర్ఫీదు ఇచ్చారు, ఇస్తున్నారు కూడా.
1995 లో పెళ్ళి జరిగిందని ఆవిడ భర్త గారి పేరు ఉదయ భాస్కర్ - రేడియాలజిస్ట్, ఆయన తన అభివృద్దికి ఎంతో చేయూత నందించారని ఆవిడ అన్నారు. ఇద్దరు పిల్లలు పాప పేరు అమృత రవళి(10 సంవత్సరాలు), ఒక బాబు - విశ్వరోహణ్ (6 సంవత్సరాలు). ఈ కూచిపూడి విద్యనభ్యసించటం తన అదృష్టమని, పూర్వ జన్మ సుకృతమని, ఇంతటి కూచిపూడి నాట్య కళాసాగరములోని ఒక చెంచాడు (స్పూన్ ఫుల్) విద్యను క్రమశిక్షణగా తన తరువాతి తరం వారికి అందచేయటం తన విధిగా భావిస్తున్నానని ముగించారు.

































