భాగవత పద్యం

"తనవెంటన్ సిరి లచ్చివెంట నవరోధ వ్రాతమున్ దాని వె
న్కను అను బక్షీంద్రుడు దాని వెన్కను ధనుఃకౌమోదకీ శంఖచ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుడై వచ్చిరొ
య్యన వైకుంఠ పురంబునం గలుగు వా రాబాలగోపాలమున్!"

ఈ పద్యం ఆంధ్రమహాభాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోది. దీని అర్థమే పోతన జీవన విధానం.

గజేంద్రుడు మొసలి బారినుండి తనను కాపాడమని ఎవరిని ప్రార్థించాడు? భాగవత పద్యాలలో చూస్తే 'ఈశ్వరా....ఈశ్వరా' అనే సంబోధనలు ఎక్కువగా కనిపిస్తాయి.ఇక్కడ ఈశ్వరుడంటే శివుడు కాదు.విష్ణువూ కాదు.బ్రహ్మ అసలే కాదు.మొత్తం అనంతకోటి బ్రహ్మాండాలకు అధిపతియైన పరమేశ్వరుడన్న మాట. అందుకే 'పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడూ అని పేర్కొన్నాడు.మనం సర్వలోకాధిపతి, ఆత్మ చైతన్య స్వరూపుడైన భగవంతుణ్ణి ప్రార్థిస్తే విష్ణువు చక్రాయుధుడై వచ్చి కాపాడటమేమిటి? అంటే మనం "భగవంతుణ్ణి ఫలానా రూపంలో వచ్చి నన్ను కాపాడు" అని ప్రార్థిస్తే అలాగే వస్తాడు. ఏ రూపమో ప్రత్యేకించి చెప్పక పోతే స్థితికర్త, పాలన, పోషణ చూసే బాధ్యత కలవాడు కాబట్టి విష్ణుమూర్తి వచ్చి కాపాడతాడు. లోకం లోనూ అంతే.మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరినైనా పేరుపెట్టి పిలిచి లేదా వారింటికి వెళ్ళి అర్థిస్తే వారే కాపాడతారు.అలా కాకుండా 'కాపాడండి కాపాడండి ' అని అరిస్తే దగ్గరలో పోలీసు వారుంటే వారు వచ్చి కాపాడతారు.రక్షణ బాధ్యత వారిది కాబట్టి.అందుకే విష్ణు రూపంలో సర్వేశ్వరుడు వచ్చాడు.

అది సరే. గజేంద్రుడు కేవలం భగవంతుణ్ణి వచ్చి తన ప్రాణాలు కాపాడమని మాత్రమే కోరాడు.కాని అడగకపోయినా ఆయన వెంట లక్ష్మీదేవి , ఆమె వెంట అంతఃపుర స్త్రీలు, వారి వెంట గరుత్మతుడు, అతని వెనుక విల్లు, గద మొదలయిన ఆయుధాలు, ఆ పైన వైకుంఠానికి విష్ణుదర్శనం కోసం వచ్చిన నారద మహర్షి ..ఇంకా సర్వసైన్యాధిపతియైన విష్వక్సేనుడు ...ఒకరేమిటి..వైకుంఠంలో ఉండే బాలురనుండి గోపాలుర వరకు అందరూ గజేంద్రుని వద్దకు వచ్చేశారు.అంటే మనం భగవద్దర్శనం కోసం ప్రార్థిస్తే చాలు. ఆ దర్శనంతోనే సిరిసంపదలు వస్తాయి. దాసదాసీజనం సమకూరుతారు.వస్తు వాహనాలు కొనగలిగే శక్తి కలుగుతుంది. మన రక్షణ కోసం సర్వాయుధాలూ వస్తాయి. మహాత్ములూ, మహా యోగుల సాంగత్యమూ కలుగుతుంది.అత్యన్నత అధికారులు అందరూ మన చుట్టూ తిరుగుతారన్న మాట.ఈ రహస్యం తెలిసినవాడు కాబట్టే పోతన మహాకవి రాజుల చుట్టూ, రాణుల చొట్టూ, మంత్రుల చుట్టూ, వ్యాపారుల చుట్టూ తిరగటం మానేసి ఒక్క విష్ణువు చుట్టూ మాత్రమే మనస్సుని ప్రదక్షిణం చేయిస్తూ భాగవతం రచించాడు.అందుకే ఆయన ఇహలోక జీవితమూ సుఖఃగా ముగిసింది(శ్రీనాధునిలా కాకుండా). పరలోకంలో మోక్షమూ దక్కింది.ఆయన రచించిన భాగవతం ఇవ్వేళ ప్రపంచమంతా ప్రశంసలందుకుంటోది.ఈనాటి కవులూ, పండితులూ ఈ రహస్యం గ్రహించి మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగకుండా భగవంతుని యందు విశ్వాసంతో, ఆత్మ విశ్వాసంతో తమ పని ఏదో తాము చేస్తే దక్కవలసిన గౌరవాలు అవే దక్కుతాయి.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)