చూసే కనులకు మనసుంటే...
కళలకు కాణాచి, కళాకారులకు పుట్టినిల్లు అయిన సాన్ హొసె,
కాలుఫొర్నియాలో నివసిస్తున్న, కూచిపూడి నాట్యములో పావీణ్యురాలయిన
శ్రీమతి వైదేహి ఎల్లాయి గారిని మీకీనెల శీర్షికలో పరిచయం
చేస్తున్నాము.
వైదేహి ఎల్లాయి తమ అయిదవ ఏటనే భరతనాట్యం నేర్చుకోవటం మొదలు పెట్టటం జరిగింది. అంతేకాదు వీరికి తమ పన్నెండవ ఏటనే భరతనాట్యంలో "అరంగేట్రం" జరిగిందని చెప్పారు. 1985వ సంవత్సరంలో వైదేహి గారు పదవ తరగతి చదువుతున్నప్పుడు మద్రాసు కళాక్షేత్రంకి వెళ్ళి కూచిపూడి నాట్యం నేర్చు కోవాలని అనుకుంటున్నప్పుడు, చినసత్యం మాస్టారు గారు శిష్య బృందంతో కలిసి తమ ఊరికి వచ్చి "రుక్మిణీ కల్యాణం" నాటకం వేసినపుడు చూసి, కూచిపూడి నాట్యం అంతే ఎంతో ప్రీతి కలిగి, యెలాగయినా ఆ నాట్యం నేర్చుకోవాలన్న ఆశక్తితో తండ్రికి చెప్పగానే, ఆయన కాదనుకుండా ఒప్పుకున్నారని ఆవిడ అన్నారు. తల్లి తన చిన్న తనంలోనే కాలం చేయగా తండ్రే అన్నీ అయి పెంచి పెద్ద చేసారని, అన్ని బాధ్యతలు అయనే చూసుకునే వారని ఆవిడ అన్నారు. తండ్రిగారి అనుమతి తీసుకుని మద్రాసు చేరుకుని అక్కడ "వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్" లో ఉంటూ నాట్యం మొదలు పెట్టానని అన్నారు. ప్రతీ రోజూ అకాడెమికి క్లాసులకు వెళ్తూ, అక్కడ అందర్నీ చూస్తూ స్వర్గంలో ఉన్నట్లు భావన కలిగేదని ఆవిడ అన్నారు.
1985 సెప్టెంబర్ లో మద్రాసు హాస్టల్ లో ఉండడానికి ఇబ్బందులు రాగా,
వైజాగు లోని తమ చిన్నాన్న గారి ఇంట్లో ఉంటూ, వైజాగు
కళాక్షేత్రములోని బాలక్క గారి దగ్గర తిరిగి శిక్షణ కొనసాగించానన్నారు.
బాలక్క గారి దగ్గర శిక్షణ పొందిన వారిలో వీరిది మొదటి
బ్యాచు అని, అందులోని శిష్యులంతా కలిసి 1986వ సవత్సరములో "వైజాగ్
డాన్సెర్స్ సొసయిటి" అనే సంస్థను స్థాపించారని, తాను అందులో
సెక్రటరిగా పని చేసారని, ఫండ్ రైసింగ్ లో సమకూరిన డబ్బుని
ఆంధ్రప్రదేశ్ లోని వరద బాధితుల సహాయార్ధం వినియోగిస్తున్నారని
ఆవిడచెప్పారు. 1987లో మద్రాసులో జరిగిన టీచెర్స్ ట్రైనింగికి కూడా
అవిడ వెళ్ళానన్నారు. మాస్టారు గారు ఒకసారి వైజాగు వచ్చినప్పుడు మూడు
జతల గజ్జెలు తీసుకు వచ్చి, ఎవరు బాగా నాట్యం చేసి
చూపగలిగితే వారికి ఒక జత గజ్జెలు బహుమతిగ ఇస్తానని చెప్పగా,
పట్టుదలతో "జగదానందకారక" అనే అయిటం అందరి కన్నా బాగా చేసి
చూపించి జత గజ్జెలను బహుమతిగా గెలుచు కున్నారని ఎంతో గర్వంగా
చెప్పుకున్నారు, ఇంకా ఇప్పటికి కూడా అవే ఉపయోగిస్తున్నాని కూడా ఆవిడ
అన్నారు. బాలక్క గారు ఎంతో మంచి టీచరు అని, ఆవిడతో కలిసి
1988 నుండి ఎన్నో చోట్ల ప్రదర్శనలివ్వటం మొదలు పెట్టానని అన్నారు.
వారి ఇంట్లో వుంచుకుని నాట్యం నేర్చుకోవటంలో ఎంతో సహాయ పడిన
తమ చిన్నాన్న గారికి, పిన్ని గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
మాస్టరు గారు తరచూ వైజాగు వచ్చే వారని ఆవిడ అన్న్నారు. తాము యెక్కడో వూరవతల 15కిమీ దూరాన వున్నా ప్రొద్దునే కళాక్షేత్రానికి వెళ్ళి సాయంత్రం వరకూ నాట్యం నేర్చుకుంటూ అక్కడే ఉండిపొయే వారని అవిడ చెప్పారు. అక్కడ వైజాగు స్కూలులో హరిరామమూర్తి గారు, చంద్రం మాస్టారు గారు టీచర్స్ గా ఉందే వారని చాలా చక్కగా నాట్యం నేర్పించే వారని, చంద్రం మాస్టారు అలా నేర్పించదం వలననే తనకు అపుడు నాట్యం అంత బాగా అబ్బిందని ఆవిడ చెప్పుకున్నారు. తన ప్రతిభను గురువు గుర్తించటమే ఒక పెద్ద అవార్డుగా భావిస్తున్నానని ఎంతో సగర్వంగా చెప్పుకున్నరు.
1991 నవంబర్ 14న తన రంగ ప్రవేశం జరిగిందని, ఆ తరువాత 23న వివాహం జరిగాక కొనాళ్ళు ఫ్రాన్స్, కొంతకాలం బెంగుళూరు, ఢిల్లీ లో ఉండటం వలన కొంతకాలం నాట్యం కుంటు పడిందని ఆవిడ అన్నారు. 1997 లో అమెరికా వచ్చినపుడు పాప పుట్టిందని, పాపకు అయిదవ ఏట మళ్ళీ తన కూఛిపూడి నాట్యాన్ని తిరిగి కొనసాగించే భాగ్యం కలిగిందని ఆవిడ అన్నారు. భర్త పేరు ప్రభాకర్ రావుగారు - ప్రస్తుతం "సిస్కో" లో ఇంజినీర్ గా పని చేస్తున్నారని అన్నారు. వీరికి ఇద్దరు అమ్మయిలు సుహాసిని (13సంలు), సౌమ్య(9సంలు)సంగీతం, నాట్యం నేర్చుకుంటున్నారని అన్నారు.
అమెరికా వచ్చిన తరువాత, ఇండియా నుండి విసిటింగ్ ఆర్టిస్ట్ పసుమర్తి గారితో కలిసి ఎన్నో కూచిపూడి నృత్య రూపకాలు చేసానన్నారు. "మోహినీభస్మాసుర"లో విష్ణుమూర్తిగా, "మహిషాసుర మర్ధినిలో" ఇంద్రుడిగా, శివుడిగా వేసానన్నారు. అలాగే అమెరికాలో ఇంకా పలుచోట్ల ప్రదర్శనలిచ్చానన్నారు. 2004 సిలికాన్ అంధ్ర వారి "తెలుగు తేజం" అనే నృత్య రూపకాన్ని శ్రీలత సూరి గారితో కలిసి కొ-ఆర్డినట్ చేసారని, 2006లో "ధ్రువ చరిత్రం" లో కూడా వేసారని అన్నారు. నట్టువాంగం చేస్తూ వైజాగులో నృత్యరూపకాలు వేసినప్పుడు తాను "సోలొ" అయిటంస్ చేసారని, కళాక్షేత్రంలో "హరవిలాసం" వేసినపుడు ఒక "గ్రూప్" అయిటం చేసారని అన్నరు.2005 లో సిలికానాంధ్ర వారి పర్యవేక్షణలో 150 పిల్లలతో కలిపి చేయించిన "ఆంధ్ర చారిత్రిక" అనే నృత్య పద్య నాటకానికి కొ-అర్డినేటర్ గాను, కొరియొగ్రాఫర్ గాను కూడా పని చేసానన్నారు.
ఆవిడ ఆంధ్ర యునివర్సిటి ఎం.ఎ లో బంగారు పతకాన్ని సంపాదించుకున్నారు. 2003లో వాళ్ల నాన్న గారి పేరుతో, ఆయన స్మృతి చిహ్నంగా "శ్రీరంగ నాట్యాలయము" అని ఒక నాట్య కళాశాలను స్థాపించారని, అందులో ఇప్పటి వరకు 20-30 విద్యార్ధులు శిక్షణ పొందుతున్నారని, ఇద్దరు విద్యార్ధులకు రంగ ప్రవేశం కూడా జరిగిందని ఆవిడ అన్నారు. భర్త, అత్తగారు, మావగారు తనకూ ఎంతో ప్రొత్సాహమిస్తూ, తన నాట్యాభివృద్ధికి ఎంతో దోహద కారులని అన్నారు. ప్రతి సంవత్సరము తన దగ్గర నేర్చుకుంటున్న విద్యార్ధుల తల్లితండ్రుల సహకారంతో, ప్రోత్సాహంతో తమ కళాశాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో అనందంగా జరుపుకుంటారని ఆవిడ ముగించారు.






























