కూచిపూడి కూనలమ్మ మన శైలజమ్మ
డెట్రాయిట్ వాస్తవ్యులయిన శ్రీమతి శైలజ పుల్లెల గారిని గురించి ఈ నెల మన శీర్షికలో తెలుసుకుందాము. శైలజ గారి అమ్మమ్మ గారి బంధువు, ప్రహ్లాదశర్మ గారి శిష్యురాలు తమ ఊరికి వచ్చి ఇచ్చిన ప్రదర్శన చూసి అది కూచిపూడి నాట్యము అని అవగాహన లేకపొయినా, తాను కూడ అదే నాట్యము నేర్చుకుంటానని మంకు పట్టు పట్టి, మూడురోజులు అన్నం మానేసి, వారి అమ్మగారిని నాట్యం నేర్చుకోవటానికి ఒప్పించారని చెప్పారు. తాము గుంటూరు లో నివసిస్తున్నపుడు ఈ సంఘటన జరిగిందని, ఆరవ సంవత్సరములో ఉండగా చింతా ఆదినారాయణ శర్మ గారి వద్ద కూచిపూడి నాట్య ప్రవేశం చేసారని అన్నారు. చాలా సంవత్సరాలు అంటే తాను ఎనిమిదవ తరగతి చదివే వరకు అయన దగ్గరే నేర్చుకున్నారని, ఆతరువాత గురువుగారికి హైదరాబాదు ట్రాన్స్ ఫర్ అవ్వగానే మహంకాళి శర్మగారి వద్ద తాను పదవ తరగతి చదివేవరకు
నాట్య శిక్షణ కొనసాగించానని అవిడ అన్నారు. వైజాగులో పుట్టి పెరిగిన శైలజగారి తండ్రి రుద్రభొట్ల వెంకట రమణారావుగారు, తల్లి సూర్యలక్ష్మి గారు సంగీత విద్వాంసురాలు, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అని, తమ తండ్రిగారు గుంటూరు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ - హేద్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్ అని అన్నారు.
వేసవి సెలవులలో తమ తాత గారి ఊరు వైజాగుకి వెళ్ళి అక్కడి కూచిపూడి కళాక్షేత్రములో ఉంటున్న హరిమాస్టారు గారి వద్ద, బాలక్క గారి వద్ద కూడా నాట్య శిఖణ పొందారని ఆవిడా అన్నారు. తన పెదనాన్న గారు కూడా తాను నాట్యము నేర్చుకోవటానికి ఎంతో సహాయం చేసారని అవిడ అన్నారు. ఈ సమయంలోనే వెంపటి చినసత్యం మాస్టారుగారు వైజాగు వచ్చినపుడు నాట్యం చేస్తుండగా చూసి చాలా బాగా చేస్తున్నావని ఎంతో మెచ్చుకోగా, ఆమాటలే తనకు ఎంతో ఊరటనిచ్చి తన అభివ్రుద్దికి ఎంతో దోహద పడ్డాయని ఆవిడ అన్నారు. ఇంటర్ అయిపోయి డిగ్రీ చదువుతున్నప్పుడు సెలవులు ఇవ్వగానే మద్రాసు కళాక్షేత్రంలో మాష్టారు గారి వద్ద నాట్య శిక్షణను కొనసాగించారు.
చదువు మానేయటం ఇష్టంలేక, నాట్యం మద్రాసు చినసత్యం మాష్టారు గారి కళాక్షేత్రంలోనే నేర్చుకోవాలనే సాకుతో యూనివర్సిటి ఆఫ్ మద్రాసులో సీటు తెచ్చుకున్నారు. ప్రొద్దున కాలేజీకి వెళుతూ, సాయంత్రం పూట డ్యాన్సు ప్రాక్టీసుకి వెళ్లటం చేసే వారని అన్నారు. ఆ సమయములో మాష్టారు గారు కొత్తగా అర్ధనారీశ్వరం, శాకుంతలము నృత్య రూపకాలకు శిక్షణ ఇచ్చారని, అపుడు సమయం తెలిసేది కాదని ఆవిడ అన్నారు.
1982లో తనకు కూచిపూడి రంగప్రవేశం జరిగిందని, తెలుగు యూనివర్సిటి ద్వారా తనకు కూచిపూడిలో డిప్లొమా కూడా లభించిందని చెప్పుకున్నారు. భావ అభినయాల మేళవింపుతో, మంచి హావ భావముల ప్రక్రియలతో ఎంతో మంది కళాహృదయులను మెప్పుదలను పొందారని అన్నారు. ఆవిడ వెంపటి చిన సత్యం మాస్టారు గారి మాద్రాసు కళాక్షేత్రం నుండి నాట్య విశారద బిరుదును, నాట్యరాణి బిరుదును కూడా పొందానన్నారు.
1999 లో పెళ్ళి జరగగానే అమెరికాకి వచ్చారని, తాను అంతకు ముందే పెళ్ళి చూపులప్పుడే భర్తతో తనకు నాట్యం అంటే చాల ఇష్టం అని, ఎటువంటి పరిస్థితులలోనూ దానిని విడిచి పెట్టటం జరగదని అన్నానని చెప్పారు. భర్త పేరు అనంత్ పుల్లెల, ప్లానింగ్ అండ్ స్ట్రాటెజి అనలిస్ట్. ఒక పాప నాలుగు సంవత్సరాలు, పేరు ప్రణవి.
ఆవిడ 2001 లో "నాట్యతరంగిణి" అనే పేరుతో ఒక డ్యాన్సు స్కూలుని స్థాపించారు. ఆవిడ దగ్గర దగ్గర 350 ప్రదర్శనలిచ్చారని, అందులో ముఖ్యంగా చెప్పుగోదగినవి బొంబాయిలో జరిగిన కూచిపూడి మహోత్సవము, హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలు, స్వర్ణాంధ్ర మహ సభలు, సంగీత నాటక అకాడెమిలో, కళాసాగరం, కృష్ణ గాన సభ ఇలా అనేక గొప్ప మహా సభలలో, లలిత కళా తోరణం, రవీంధ్ర భారతి, త్యాగరాయ గాన సభలో మరియు అనేక కళోత్సవాలలొ పాల్గొన్నారని అన్నారు. గురువు మహంకాళి సూర్యనారయణ శర్మ గారి పర్యవేక్షణలో జరిగిన శాకుంతలము, మోహినీ భస్మాసుర, నౌకాచరితము, బుద్దం శరణం గచ్చామి నృత్య నాటకాలలో అనేక ప్రత్యేక పాత్రలను పోషించారు. అదే విధంగా వెంపటి చినసత్యం మాష్టారు గారి పర్యవేక్షణలో జరిగిన రామాయణం, అర్ధనారీశ్వరం, క్షీరసాగర మధనం, హరవిలాసం, రుక్మిణీ కళ్యాణం నృత్య రూపకాలలో కూడా ప్రత్యేకమయిన పాత్రలను పోషించినట్లు అవిడ తెలిపారు. ఇలాగే అవిడ తన శిష్యులతో కలిసి కూడా పలు ఉత్సవాలలో, ఫండ్ రైసింగ్ కార్యక్రమాలలో కూడా ఎన్నో ప్రదర్శనలిచ్చారని చెప్పుకున్నారు.
శైలజగారు యూనివెర్సిటి ఆఫ్ మిచిగాన్లో రీసెర్చ్ అస్సొసియేట్ గా పని చేస్తున్నాట్లు తెలిపారు. తాను నేర్చుకున్న కళను పది మందికి పంచిపెట్టాలనే కోరిక ఎంతగానో ఉందని, తన తోటి కళాకారులతో కలిసి ఈ కూచిపూడి నాట్యాభివృధికి ఎంతో కృషి చేస్తానని చెప్తూ ముగించారు.

























