లేఖాప్రణయం
వర్ణన: నరసింహాచార్య
ప్రణయం పరిణయానికి "ప్రణవం" లాంటిది. యవ్వనదశలో ప్రతిఒక్కరికి మధురమైన అనుభూతిని కల్పించే రాగనయగారమే అనురాగం. యువహృదయాలలో చిగురించే ఈ మొలక ఇంతై, ఇంతింతై అన్నరీతిలో హృదయసామ్రాజ్యాన్ని వశంచేసుకునే పరవశాల పరాగమే ఈ ప్రణయం.
ప్రియనెచ్చెలి పరిష్వంగంలో ఒదిగిపోతూ రాగబంధాలలో కరిగిపోవాలనుకోవడం, యువజంటల ప్రణయతత్వం. అహరహం కలిసి ఉండాలనుకునేవారిని అతితీవ్రంగా బాధించేదే విరహం.చల్లని వెన్నెలసైతం వేడిమిని కల్గించడం, తామరవింజామరల గాలులు వడగాలులవలే బాధించడం, పువ్వులుసైతం గుచ్చుకునే బాధను పొందడం వంటి ప్రేమికుల అగచాట్లు వర్ణనాతీతం.
సఖుడు దూరమైనకొలదీ మరింత విజృంభించే మదనజ్వరమే ప్రణయం.తన మనోగతభావాలను,రాగాన్ని తెలిపేదే లేఖాసందేశం.ప్రియుని సమక్షంలో తెలుపలేని ఎన్నో మనోభావాలకు వేదిక ప్రణయలేఖ.
ఆ ప్రణయాన్ని,అనురాగబంధాన్ని,లేఖాసందేశ రూపంలో అభినయిస్తోంది కావ్యనాయిక శకుంతల ఈ చిత్రంలో.అనసూయ ,ప్రియంవదల సాహచర్యంలో తనమనోభిరామునికి వలపు సందేశాన్ని పంపుతోంది.మన్మధచాపంలాంటి కనుబొమ్మలు పైకెత్తబడి, రాగాంచితచెక్కిళ్ళు, ఆ చెక్కిలికి చేర్చినచేయి ఆమె ఆలోచనలకు అద్దంపట్టేరీతిలో చిత్రించారు చిత్రకారులు. హరితపత్రాలు ఈ రసభరితచిత్రానికి వన్నెకూర్చి,ఆహ్లాదవాతావరణాన్ని సుశోభితంచేస్తున్నాయి.
నాటి హంససందేశం, మేఘసందేశం లాగే నేటి లేఖా సందేశం ప్రియాన్ని కలిగిస్తూ, ప్రేయసిప్రియుల దూతికలా భాసిస్తోంది.కాళిదాసు మానసపుత్రిక శకుంతల గుణగణాలన్నీ చిత్రబధ్ధంగా, వైచిత్రయుక్తంగా మలిచారు చిత్రకారులు ఈ చిత్రంలో.
























