వీక్షణం

వీక్షణం-58వ సమావేశం

-పొట్లూరి చాయాదేవి

నేటి సమావేశం లోని ముఖ్యాంశాలు:- ఈ సమావేశానికి శ్రీ మేకా రామస్వామి గారు ఆహ్వానం పలుకుతూ సాహితీ ప్రపంచానికి ఎల్లలు లేవని అన్నారు. తెలుగు భాష తీగలు భువనమంతా పాకాయని, వాటిని కాపాడవలసిన బాధ్యత ప్రతీ తెలుగు వారికి ఉందని తెలిపారు.
శ్రీమతి కాత్యాయనీ విద్మహే గారు మరాఠీ అనువాదం “మా బతుకులు” అనే పుస్తకం గురించి విశ్లేషణ చేసారు. తను ఎక్కువగా సాహిత్యంలో స్త్రీల సమస్యల పై స్పందిస్తానని అన్నా రు. స్త్రీల రచనలు సేకరించడం తన బాధ్యతగా భావించానని అన్నారు. సాహిత్యంలో స్త్రీల రచనల పట్ల అసమానతలున్నాయని, వాటిని రూపుమాపాలని, స్త్రీలు తమ రచనలలో తమ అభిప్రాయాలని స్వేచ్ఛగా పొందుపరుస్తారని అన్నారు. స్త్రీల రచనల్లో ఆత్మ కథలు, స్వీయ చరిత్ర లు బహు తక్కువని, అందులో ఒకటి మహారాష్ట్ర లో 1965 లో దళిత మహిళ సమాజంలో అనుభవించిన బాధల సమాహారమే “మా బతుకులు” నవల అన్నారు.

మా బతుకులు నవల మరాఠీ భాషలో 1980 లో స్త్రీ అనే పత్రికలో సీరియల్ గా వచ్చింది. బేబీ కాంబ్లే ఈ నవలను 1960 లో రాసినా రెండు దశాబ్దాల త్ర్వాత ప్రచురణకు నోచుకుంది. వర్గ విభేదం సమాజంలో బలంగా వేళ్లూనుకుందని, దానిని కూకటి వేళ్లల్తో సహా పెకలించివేయాలని అన్నారు. బేబీ కాంబ్లే దళితుల ఆర్థిక జీవనం, సంస్కృతిని తన ఆత్మకథలో చిత్రించారు. అగ్ర స్త్రీ వర్ణానికి, దళిత స్త్రీ వర్గానికి వివక్ష గురించి చర్చించారు. వస్త్రధారణతో సహా వివక్ష ఉండడం గమనించవలసిన విషయం అన్నారు. అత్తా, కోడళ్ల గురించి చెబుతూ బేబీ కాంబ్లే “మేము అందరికీ బానిసలం, కానీ కోడళ్లు అత్తలకు బానిసలే కదా” అన్నారు.

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జీవించాలని పిలుపునిచ్చారు. దళీత స్త్రీల పట్ల వివక్షను గురించి తెలిపే ఇతర రచనల గురించి కూడా కాత్యాయని టూకీగా ప్రస్తావించారు. 1940 లో హవాయి కావేరీబాయి రాసిన “పరిణామం” నవల, 1930 లో గృహలక్ష్మి పత్రికలో సుసర్ల లక్ష్మీ నరసమాంబ రాసిన కథలు, వ్యాసాలు, 1920 లో ఆదుర్తి భాస్కరమ్మ రచనల గురించి వివరించారు. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థల ప్రారంభం గురించిన చర్చలో మెకాలే, విల్సన్ ల కాలంలో ప్రారంభమైన వర్ణ వ్యవస్థ గురించి పిల్లలమర్రి కృష్ణ కుమార్ మట్లాడారు. తర్వాత అత్యంత మనోరంజకంగా సాహితీ క్విజ్ కార్యక్రమం శ్రీ కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత జరిగిన కవితా సమ్మేళనంలో వేణు ఆసూరి గారు హేతువాదం గురించిన కవితను వినిపించారు. మేకా రామస్వామి గారు “జీవన వైవిధ్యం ” అనే కవితను వినిపించారు. ఇందులో పక్షులకు, మనుషులకు గల సారూప్యతను గురించి వివరించారు. శ్రీమతి కె.గీత గారు “పుట్టగొడుగు మడి” కవితను వినిపించారు. వయసొచ్చిన రూపంలోని తెల్ల జుత్తును పుట్టగొడుగు మడిగా పోల్చిన కవిత ఇది.

కిరణ్ ప్రభ గారు రేడియోలో సాహిత్యం గురించి తెలుపుతూ తను సాహిత్యం లోని ప్రసిద్ధ పుస్తకాలు రోజువారి కార్యక్రమంగా మాటల రూపంలో చెప్పటం ద్వారా సుపరిచితులు. సాహిత్యం పట్ల అభిరుచితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. శ్రీమతి గీత గారు తాను అమెరికా వచ్చిన కొత్తలో తెలుగు భాషను, సాహిత్యాన్ని మరిచిపోయేనని, దానికి పునరుజ్జీవనం పోస్తూ వీక్షణం సాహితీ గవాక్షాన్ని ప్రారంభించానని, ఈ రోజు 58 వ సమావేశం జరుగుతూందని, ఈ స్థాయికి తీసుకు రావడానికి అందరి సహకారం ఎంతో ఉందని, ఇందు కోసం తన సాయశక్తులా కృషి చేస్తూనే ఉంటానని, ఈ సాహితీ వనంలో చెట్లు నాటడం, పెంచడం తనకు ఊపిరి, బలం అని, దీనికి జీవం పోయడం తన విధి అన్నారు. ఈ కార్య క్రమం ఆద్యంతం బహు రసవత్తరంగా జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked