రాక్షసుల పుట్టుపూర్వోత్తరాలు
అగస్త్యులవారప్పుడు "సరే! అయితే విను. రావణుడి పుట్టుపూర్వోత్తరాలు ముందుగా చెప్పి, ఇంద్రజిత్తు ఆ రావణుణ్ణి ఎట్లా మించిపోయినాడో నీవే తెలుసుకొనేట్లు ఆ రాక్షసుల వృత్తాంతం చెపుతాను" అన్నారు.
“కృతయుగం దగ్గరకు వద్దాం. బ్రహ్మదేవుడు ముందుగా పదిమంది ప్రజాపతులను (మానసపుత్రులను) సృష్టించాడు కదా! ఈ పదిమందిలో పులస్త్యుడు ఒకడు. ఆయన బ్రహ్మర్షి, వేదనిధి, తపస్వి, మహామహిమాన్వితుడు. ఆయన నిరంతర తపస్సు కోసం మేరుపర్వత పాదప్రదేశంలోని తృణబిందు మహర్షి ఆశ్రమం ఆవాసంగా చేసుకున్నాడు. అయితే ఆ ప్రాంతం రమ్యమైన ప్రకృతి సౌందర్య విరాజితమైన ప్రదేశం కాబట్టి సకల దేవగణ సుందర తరుణులు అక్కడ ఆటపాటలతో, వేడుకలతో, తమ యౌవన విలాసాలతో విహరిస్తుండే వారు. అది పులస్త్య మహర్షికి భరింపరానిదైంది. ఆయనకు చాలా కోపం వచ్చింది. “నా చూపుమేర ఇక్కడకు వచ్చినవాళ్ళు, నా తపస్సుకు అంతరాయం కలిగించిన వాళ్ళు తమ కన్యత్వం పోగొట్టుకొ